విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఒప్పుకోం..

విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేపట్టిన ధర్మాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిందన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారని, లేఖ ద్వారా ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయాలు సూచించారని గుర్తు చేశారు. స్టీల్ప్లాంట్కు గనులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిపారు. పార్లమెంట్లో కూడా విశాఖ స్టీల్ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించామని అన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ప్లాంట్ అంశాలపై సభను అడ్డుకున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశంతో స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పేర్కొన్నారు. కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఇప్పటికీ నెలకు రూ.200 కోట్ల లాభంతో ఉక్కు కర్మాగారం నడుస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరణ చేయటం బీజేపీ ప్రభుత్వం విధివిధానాల్లో ఒకటి. కానీ, విశాఖ ఉక్కు లాభాల్లో నడుస్తోంది. మధ్యలో కొన్ని సంవత్సరాలు నష్టాలు వచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన సంస్థను ప్రైవేటీకరించడం తగదు అని అన్నారు.