ప్రశాంత్ కిశోర్కు వైకాపా 50 కోట్లు
సలహాలు, సూచనలతొ పార్టీని గెలిపించేందుకు వచ్చిన ప్రశాత్ కిశోర్కు వైకాపా 50 కోట్లు ఇస్తుందట! తాము సలహాలు సూచనలతో పాటు విజయాన్ని కూడా అందించాం కాబట్టి తమకు రెట్టింపు పారితోషికం ఇవ్వాలంటున్నారు టీడీపీలోని నేతలు.. అంటున్నారు కానీ ఈ విషయం చంద్రబాబుకు ఎలా చెప్పాలనేదానిపైనే చర్చలు జరుపుతున్నారు.. అసలు ఈ డిమాండ్ ఎవరి నుంచి వచ్చింది..? పీకే కంటే తామేమీ తక్కువ కాదంటున్నది ఎవరు..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశంపార్టీలో హాట్ టాపిక్గా మారింది.. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలతో నంద్యాలలో నోరు పారేసుకున్న జగన్మోహన్రెడ్డికి అక్కడి ఫలితం షాక్ ఇచ్చింది.. ఎలా మాట్లాడైనా సరే…జనం దృష్టిని ఆకర్షించాలని పీకే ఇచ్చిన సలహా చివరకు నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను పీకేయించింది.. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు నుంచి అయిదు వేల మెజారిటీతో గెలుస్తుందని పీకే చెప్పారట! అయితే ఫలితం మాత్రం పీకే అనుకున్నట్టుగా రాలేదు.. ఒక ఉప ఎన్నికలోనే వ్యూహాన్ని నిర్ణయించలేని ప్రశాంత్ కిశోర్ ఇక సాధారణ ఎన్నికలలో ఏమి చేస్తారని తెలుగుదేశంపార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. తెలుగుదేశంపార్టీలో ఇందుకు పూర్తి విరుద్ధమైన చర్చ జరుగుతోంది.. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేషీలో మంత్రులు ఆదినారాయణరెడ్డి… ప్రత్తిపాటి పుల్లారావు… ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్లు భేటీ అయ్యారు. నంద్యాల ఎన్నికపై విశ్లేషణ చేశారు. ఎవరు ఎలా కష్టపడింది చెప్పుకున్నారు. నంద్యాల ఉప ఎన్నిక అనుభవాలను నెమరేసుకున్నారు.
ఈ తరుణంలోనే జోక్లు పేలాయి.. ఆసక్తికరమైన సరదా సంభాషణ చోటు చేసుకుంది. పేషీలో సందడిగా ఉండటంతో అక్కడేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏబీఎన్ వెళ్లింది.. ఇక అక్కడ జరిగే చర్చ అంతా సరదాగా జరిగినా … తర్వాత తర్వాత ఆసక్తిగా మారింది.. ‘పొలిటికల్ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 కోట్లను పారితోషికంగా ఇస్తోంది.. ఆయన ఇచ్చేది కేవలం సలహాలు సూచనలు మాత్రమే! మనమేమో గెలిచి చూపించాం.. అంటే మనకు అంతకు రెండింతలు అంటే వంద కోట్లు ఇవ్వాలి’ అని ఆమంచి కృష్ణమోహన్ సరదాగా అన్నారు. వెంటనే ఆదినారాయణరెడ్డి జోక్యం చేసుకుని ‘ ఆ వంద కోట్లను 16 మందికి సమానంగా పంచాలి’ అని అన్నారు. అదేం లెక్క అన్న అనుమానం అక్కడే ఉన్నవాళ్లకు కలిగింది.. ఆ విషయాన్ని ఆదినారాయణరెడ్డినే అడిగేశారు.. ‘మంత్రులు.. ఎమ్మెల్యే సంఖ్య అది …అందుకే 16 మందికి డబ్బును పంపిణీ చేయాలని చెప్పా’ అని అన్నారు ఆది.. మరి మీ దగ్గర పీకే లేడు కదా? అని మరో నేత ప్రశ్నించగా… ‘ఎందుకు లేడు.. మాకూ ఉన్నాడు పీకే…ఎవరంటే పయ్యావుల కేశవ్’ అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.
మీకు వంద కోట్ల రూపాయలు ఇచ్చే విషయం చంద్రబాబుకు ఎవరు చెబుతారని ఎవరో అడిగారు.. ‘ఏదో సమయంలో మా బాస్ మూడ్ చూసుకుని మేమే చెబుతాం’ అని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన దగ్గర సీరియస్ గా మీటింగ్ జరిగే సమయంలో కొద్ది సేపు రిలాక్స్ కావటానికి ఇటువంటి జోక్ చెపితే అందరం కొద్ది సేపు హాయిగా నవ్వుకోవచ్చు కదా అని ఆదినారాయణ రెడ్డి సంభాషణను ముగించారు. నిజానికి నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందని అందరూ భావించారు.
తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదే అనుకున్నారు. ఆ మండలానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఆమంచి కృష్ణ మోహన్ ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. వీరు దాదాపుగా నెల రోజుల పాటు గోస్పాడు మండలంలోని గ్రామాలను విభజించి, అక్కడే ఉండి అనుచరులను కూడా తీసుకువెళ్లి ప్రచారం చేశారు. కసరత్తు నిర్వహించారు. చివరకు గోస్పాడు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రావటం, ఆ పార్టీ నేతలకు అమితానందాన్ని కలిగించింది. అందుకే ఈ నేతలు తాము పీకే కంటే నాలుగాకులు ఎక్కువే చదివామని చెబుతున్నారు.













