వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం
వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో సౌకర్యాలపై దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మరో 17 వేల కాలనీలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఆ కాలనీల్లో పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ వచ్చేలా నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భీమిలి-భోగాపురం మధ్య 6 లేన్ల రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే గోస్తనీ నదిపై వంతెన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పురపాలిక, పట్టణాభివృద్ధిశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
పట్టణ గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్ స్వగృహ పేరిట గతంలో తక్కువ ధరకు ప్లాట్లు ఇచ్చేవారని, ఇప్పుడు వాటికి బదులు తక్కువ ధరకు స్థలం ఇవ్వాలనే ఆలోచన ఉందని జగన్ తెలిపారు. ప్రైవేటు స్థలాలు కొంటున్న వారికి అనేక ఆందోళనలు ఉంటున్నాయని, అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే ఎలాంటి ఆందోళనలు ఉండవన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లు ఇచ్చే అంశంపై ఒక విధానాన్ని రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.













