104కు కాల్ చేసిన వెంటనే… కచ్చితంగా

104 నంబర్కు కాల్ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్లు, టాస్క్ పోర్సు బృందంతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని అన్నారు. అవసరమైన వారికి బెడ్ కేటాయించేలా చూడాలని స్పష్టం చేశారు. 104కు కాల్ చేస్తే ఫోన్ కలవలేదని, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. బెడ్ అవసరం లేదంటే కొవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలన్నారు. కొవిడ్ బాధితుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పడకలను గణనీయంగా పెంచాలని సూచించారు. వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, కేంద్ర నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి, లభ్యత రాష్ట్ర పరిధిలోకి కాదని అందరికి తెలుసని, అన్నీ తెలిసి కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నెలకు 19 లక్షలకు పైగా డోసులే వస్తున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్కు వెళ్లడంపై ఆలోచించాలని దీనిని అధికారులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోస్ అందేలా చూడాలని చెప్పారు. పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, బ్లాక్మార్కెట్కు తరలించకుండా చూడాలని, వాటి వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆడిటింగ్ ఉండాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట కనిపించకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీకాలు ఎవరికి వేస్తారనేది ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజలకు చెప్పాలన్నారు.