పంట నష్టపోయిన సీజన్ లోనే పరిహారం : సీఎం జగన్

పంట నష్గపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నుంచి, పంట నష్టపోయిన సీజన్లోనే పరిహారం అందించే స్థాయిలో ఉన్నామని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎప్పుడు వస్తుందో గతంలో తెలిసేది కాదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయిన సీజన్లోనే పరిహారం చెల్లిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ‘వైఎస్సార్ ఉచిత బీమా పథకం’’ కింద ఖరీఫ్-2020 సీజన్కు సంబంధించి అర్హులైన రైతులకు వారి ఖాతాల్లో జగన్ సర్కార్ పరిహారాన్ని వేసింది. దాదాపు 15.15 లక్షల మంది ఖాతాల్లోకి 1,820.23 కోట్ల పరిహారాన్ని ఖాతాల్లో జమ చేశారు. రైతులు, రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని, గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు.
గతేడాది ఖరీఫ్లో 15.15 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులందరికీ 1,820.23 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. 2018-19 ఇన్సూరెన్స్ బకాయిలను కూడా 715 కోట్లు విడుదల చేశామని, 2019-20 ఉచిత పంటల బీమా పరిహారంగా 1253 కోట్లు ఇచ్చామని తెలిపారు. రైతులపై భారం పడకుండా పంటల బీమాని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. 23 నెలల కాలంలో రైతుల కోసం 83 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని, రాష్ట్రంలో ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.