సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్లాక ఆర్డినెన్స్ ఎలా ఇస్తారు ?
మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులపై సెలక్ట్ కమిటి నిర్ణయం ఏళ్లు కూడా పట్టవచ్చని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సెలెక్ట్ కమిటీ కాలపరిమితి కనీసం మూడు నెలలని, అవసరమైతే పొడిగించవచ్చని తెలిపారు. సెలెక్ట్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. గతంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్లను తిరస్కరించారని, సుప్రీం తీర్పు ఇచ్చిందని యనమల గుర్తు చేశారు. మండలిని ప్రోరోగ్ చేయకుండా ఆర్డినెన్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఆర్డినెన్స్ ఇచ్చినా కోర్టులో నిలబడదన్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు రూల్ 71పై అవగాహన లేదని అన్నారు. రూల్ 154 కింద చైర్మన్ విచక్షణాధికారాలను కోర్టులు ప్రశ్నించలేవని ఆయన పేర్కొన్నారు. సెలెక్ట్ కమిటీ మండలి వరకే పరిమితమని, అందులోనూ మెజార్టీ తమదే అన్నారు. రెండు బిల్లులపై రెండు కమిటీలు వేయమన్నామని చెప్పారు. శాసనమండలి రద్దు జగన్ వల్ల కాదని సృష్టం చేశారు. మండలి రద్దుపై తీర్మానం మాత్రమే చేయగలరని పార్లమెంట్ ఆమోదించాలి, రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపారు.













