వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు : పవన్ కల్యాణ్
ఎక్సైజ్శాఖలో శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలే జరిగాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ఎక్సైజ్శాఖ శ్వేతపత్రంపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు ఈ శాఖ వల్ల రూ.18 వేల కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. మద్యం కుంభకోణం కారకాలను కచ్చితంగా శిక్షించాలన్నారు. తప్పు చేసిన వారిని వదిలేస్తే ప్రజాప్రతినిధులకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదన్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఎంతో సంబరపడ్డాం. అదే ఎక్సైజ్శాఖ నుంచి ఖజానాకు రావాల్సిన రూ.18 వేల కోట్లు వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. రూ.20 వేలు లంచం తీసుకున్న ఓ సాధారణ ఉద్యోగిని శిక్షించగలుగుతున్నాం. ఇంత భారీ మొత్తంలో దోపిడీకి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా? అనే ఆలోచన సామాన్యుడికి కలగకుండా చేయాలి. మద్యం వ్యసనం తగ్గించేలా డి-అడిక్షన్ సెంటర్లకు బడ్జెట్ కేటాయించాలన్నారు.













