ఐకాస అయితే వైకాపా అవసరం లేదా? : ఉండవల్లి శ్రీదేవి
వచ్చే డిసెంబరు లేదా రానున్న బడ్జెట్ సమావేశాల్లోను మూడు రాజధానులపై మళ్లీ కొత్త బిల్లు తీసుకొస్తామని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులనేవి తప్పనిసరిగా ఉంటాయి. దాంటో తిరుగు లేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తగ్గేదే లేదన్నారు. ఆయన చెప్పాడంటే.. చేస్తాడంతే అని స్పష్టం చేశారు. పాదయాత్రకు భయపడుంటే ప్రారంభం కాకముందే నిర్ణయం తీసుకునే వాళ్లం. కోర్టులో రాజధాని కేసుల విచారణ జరుగుతోంది. తీర్పు రాబోతుంది. చట్టంలో కొన్ని క్లాజ్లు మిస్ అయ్యాయి. దానికి సవరణలు చేసి మళ్లీ పెడతాం. అంతేగానీ పెట్టబోమని ఎక్కడైనా చెప్పామా? సర్వేజన సుఖీనోభవంతు అనేది సీఎం జగన్ ఆశయం అని పేర్కొన్నారు.
రాజధాని రైతులకున్న అపోహలను తొలగించేందుకు వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరికి కూడా తీసుకెళ్తామని అన్నారు. వారు వచ్చేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే అక్కడున్నది రైతులు కాదు, టీడీపీ బినామీలు అన్నారు. రాజధాని ఐకాసలో రైతులెవరైనా ఉన్నారా? పాదయాత్ర ప్రారంభించినప్పుడు వైకాపా నేతల్ని ఎవరినైనా పిలిచారా? ఐకాస అయితే వైకాపా అవసరం లేదా? అని ప్రశ్నించారు.













