ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలి : కోమటిరెడ్డి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా పాలకుల కళ్లు తెరిపించాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఎంపీ కవిత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన విషయాన్ని కోమటిరెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ విభజన చట్టాలు అమలు చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని తెలపాలన్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? అని అడగ్గా, దానిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని సమాధానమిచ్చారు.













