విశాఖ వేదికగా డిసెంబర్లో టెక్-2017 సదస్సు
విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో యునెస్కో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ (జిఐఇపి) సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహించనుందని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో విశాఖలో నిర్వహించిన ఐఎఫ్ఆర్, భాగస్వామ్య సదస్సు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ గవర్నెన్స్ వంటి సదస్సుల మాదిరి టెక్-2017ను భారీ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. డిసెంబర్ 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో పాటు రాష్ట్ర ఐటి, టూరిజం, సాంస్కృతిక శాఖల మంత్రులు హాజరవుతారన్నారు. సదస్సుకు 71 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు, 9 దేశాల నుంచి మంత్రులు, 50 మంది అంబాసిడర్లు పాల్గొంటారన్నారు.













