శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్ల తర్వాత మూడవీధుల్లో స్వామివారి విహరించనున్న నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలో సంప్రదాయబద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 (9 రోజులు) వరకు ఆలయ మాడవీధుల్లో వివిధ రకాల వాహనసేవల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు టీటీడీ పేర్కొంది.













