అసెంబ్లీ దీనిపై చర్చ జరపాలని టీడీపీ పట్టుబడితే… : అచ్చెన్న
విజయవాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే తాను పార్టీ కార్యాలయానికి వెళ్తున్నానన్నారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక సమాజాంలో ఉన్నామా అని ప్రశ్నించారు. హౌస్ అరెస్ట్ చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసన తెలిపేందుకు వీలు లేకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ సారా తాగి చనిపోతే ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో దీనిపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబడితే మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













