ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఖరారు
త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే వీటికున్న ప్రాధాన్యత తక్కువే. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వాటికి ముందు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో, ప్రధాన పార్టీలు తమ బల నిరూపణకు దీన్నొక అవకాశంగా పరిగణిస్తున్నాయి. పార్టీల వైఖరి చూస్తుంటే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు హోరాహోరీ తప్పేలా లేదు. తాజాగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిని ఖరారు చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. చోడవరం నియోజకవర్గానికి చెందిన వేపాడ చిరంజీవరావును తమ అభ్యర్థిగా ప్రకటించారు. రాష్ట్రంలో మార్చి 29న ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. వైసీపీ, పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు చేపట్టనున్నారు. అదేరోజు రాష్ట్రంలో ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పదవీకాలం కూడా ముగియనుంది.













