ఐరాస సదస్సుకు… అంతర్వేది మహిళ

ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది గ్రీన్ వార్మ్ సభ్యురాలు తాడి దీపికకు అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనేందుకు అవకాశం లభించింది. జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి వర్చువల్ గా ఓ సదస్సును నిర్వహిస్తోంది. ఆన్లైన్ ద్వారా జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు గ్రీన్వార్మ్ సభ్యురాలు తాడి దీపికను ఎంపిక చేశారు. ఐక్యరాజ్యసమితి సముద్ర విభాగం ప్రతినిధులు ఇప్పటికే దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆమె నుంచి వీడియో ద్వారా సేకరించారు. ఈ విషయాన్ని గ్రీన్వార్మ్ ప్రాంతీయ ప్రతినిధి అక్షయ్ గుంటేటి, ఆ సంస్థ సఖినేటిపల్లి మండల సమన్వయకర్త సునీల్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
వర్చువల్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 45 మంది పాల్గొననున్నారు. ఇందులో భారత్ నుంచి దీపిక పాల్గొంటున్నారు. అంతర్వేది కేంద్రంగా గ్రీన్వార్మ్, స్మార్ట్ విలేజ్ మూవ్మెంటు ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జీరోవేస్ట్ ప్రాజెక్టు ఏర్పాటైంది. గోదావరి నదీ పాయలు, సముద్ర జలాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. అయితే సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఏటా జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు.