శాసనమండలి నుంచి సోము వాకౌట్
ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ సభ్యులు పదేపదే విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తూ శాసనమండలి నుంచి బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు వాకౌట్ చేశారు. అమరావతిలో అభివృద్ధి అంశంపై మండలిలో జరిగిన చర్చ సందర్భంగా వీర్రాజు, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆశలపై నీళ్లు చాల్లారని, మట్టి తెచ్చి ఏపీ ప్రజల నోట్లో కొట్టారని టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. దీనిపై సోము వీర్రాజు స్పందిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. వారి వ్యాఖ్యలకు నిరసనగా తాను మండలి నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి ఆయన బయటకు వెళ్లిపోయారు.













