మాజీ మంత్రి అయ్యన్నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. పోర్జరీ కేసు వ్యవహారంలో దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నర్సీపట్నంలో తన ఇల్లు నిర్మించే క్రమంలో ఎన్వోసీ కోసం నీటిపారుదల శాఖ అధికారి సంతకాలను అయ్యన్న ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అయ్యన్న హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజుల క్రితం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆ కేసుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ సా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోర్జరీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతూ ఆదేశాలు ఇచ్చింది. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారమే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగానే విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.













