ఏపీకి ఊపిరిపోయడానికి సిద్దమైన విశాఖ స్టీల్ ప్లాంట్…!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా చర్యలు చేపడుతుంది. సిఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్) సీఎండీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. కోవిడ్ చికిత్స కోసం అదనపు పడకలు ఏర్పాటుకు విశాఖ స్టీల్స్ ముందుకు వచ్చింది. 850 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్లుకు గాను కేవలం 100 మెట్రిక్ టన్నుల ఎంఎల్ఓ ఉత్పత్తి అవుతుందని స్టీల్ ప్లాంట్ అధికారులు వివరించారు.
2013లో ఈ ప్లాంట్ పూర్తైనప్పటికీ కాంట్రాక్టింగ్ ఏజెన్సీతో గతంలో సంప్రదింపులు పూర్తికాలేదని ఆర్ఏఎన్ఎల్ అధికారులు వివరించారు. ప్రస్తుతం సంప్రదింపులు పూర్తైన దృష్ట్యా 6 నెలల్లో ప్లాంటు అందుబాటులోకి వస్తుందని స్టీల్ ప్లాంట్ అధికారులు వివరించారు. వారం రోజుల్లో ప్లాంట్ స్ధితిగతులపై కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి చెందిన ప్రత్యేక బృందం అధ్యయనం చేస్తుంది. ఈ ప్లాంట్ సందర్శనకు నావల్ డాక్యార్డు అధికారులు అంగీకరించగా… కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి అవసరమైన సహాయానికి హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ప్లాంట్ అందుబాటులోకి రానప్పటికీ భవిష్యత్తు అత్యవసరాలకు ఈ ప్లాంట్ గణనీయంగా ఉపయోగపడుతుందని ఆర్ఐఎన్ఎల్ అధికారులు వివరించారు. గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం ఆక్సిజన్తో కూడిన 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంగీకారం తెలిపింది. వీటికి అదనంగా మరో 150 పడకలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి, మే 15 నాటికి అందుబాటులోకి వస్తాయని స్టీల్ ప్లాంట్ సీఎండీ వివరించారు.
మే 30 నాటికి 250 పడకలు, జూన్ 2021 నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్టీల్ ప్లాంటు అధికారులు వివరించారు. అందుకు తగిన విధంగా వైద్యులను, మెడికల్ స్టాప్ను అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులు కోరారు. నేవీ, స్టీల్ ప్లాంట్ అధికారుల విజ్ఞప్తి మేరకు వారి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం 4000 వాక్సిన్స్ను కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్, తూర్పు నావికాదళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.