ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ
ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నాలుగువారాల్లో రంగులు తొలగించాలని ఆదేశించింది. వైకాపా జెండాలను పోలిన రంగులను నాలుగు వారాల్లో తొలగించకపోతే కోర్టు దిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం సృష్టం చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సృష్టంగా ఉందన్న సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రంగులు తొలగించకుండా తప్పు చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకసారి జీవో కొట్టివేసిన తర్వాత మళ్లీ వేరే రంగు జతచేసి జీవో ఎందుకు తెచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623ని న్యాయస్థానం రద్దు చేసింది.













