రామతీర్థానికి తరలిన సీతారామలక్ష్మణ విగ్రహాలు
ఆంధ్రప్రదేశ్లో పవిత్ర క్షేత్రంగా భావించే రామతీర్థంలో ప్రతిష్టించడానికి సీతారామలక్ష్మణ విగ్రహాలు సిద్ధమయ్యాయి. తిరుపతి నుంచి తయారై వచ్చిన మూడు విగ్రహాలను రామతీర్థానికి తరలించారు. నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచలంపైనున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గల సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో శ్రీరాముడి విగ్రహాన్ని గత నెల 28 వ తేదీ అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేసిన విషయం విదితమే.
అయితే ఆ విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం సంకల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన ఎస్వీ శిల్ప కళాశాలలో విగ్రహాలు తయారు చేయించారు. దేవాదాయశాఖ విజ్ఞప్తి మేరకు విగ్రహాలను 10 రోజుల్లో టీటీడీ తయారు చేయించింది. రాముడు విగ్రహం రెండున్నర అడుగులు, సీతా, లక్ష్మణ విగ్రహాలు రెండు అడుగులు చెక్కారు. రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల నమూనాతోనే విగ్రహాల తయారీ జరిగింది.













