మూడో స్థానంపై టీడీపీ కన్ను?
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి అవకాశం ఉంది. శాసనసభ్యులు సంఖ్యాబలం ఆధారంగా టీడీపీకి రెండు, వైకాపాకు ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు వైకాపా తన అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పేరును ప్రకటించేసింది. ప్రభాకర్రెడ్డి ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యేలతో రాజ్యసభ ఎన్నికలపై మంతనాలు ప్రారంభించారన్న ప్రచారం సాగుతోంది. టీడీపీకి దక్కే రెండు స్థానాలతో పాటు మూడో అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. దీనిపై టీడీపీ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, టీడీపీ అభ్యర్థి పోటికి పెడితే వైకాపా తన ఎమ్మెల్యేలతో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.













