చరిత్రలో ఇలాంటి కమిటీ లేదు : పయ్యావుల
పెగాసస్పై టీడీపీ ఎమ్మెల్యేలు లేకుండా హౌస్ కమిటీ చేశారని, చరిత్రలో ఇలాంటి కమిటీ లేదని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెగాసస్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. పెగాసస్ జరిగిందా లేదా అనే ఒక్క పదం కూడా ఎక్కడా లేదని అన్నారు. పెగాసస్ వాడినట్లు అనుమానం ఉందని కూడా నివేదికలో చెప్పలేకపోయారన్నారు.
గడప గడపకు వెళ్తున్న డేటా వైసీపీ సర్కార్ ప్రభుత్వం దొంగలించిన డేటా అన్నారు. నివేదికతో పాటు మూడేళ్ల సమాచారమూ సుప్రీంకోర్టు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ నివేదిక బయటకు రాకుంటే ఏదో జరిగిపోయిందని చెప్పేవారని, లేనిది ఉన్నట్టు చెప్పాలని ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ చెబితే ఎన్నికల కమిషన్ ఓట్లు తొలగిస్తుందా? అని ప్రశ్నించారు.













