24, 25 తేదీలలో ఫోస్టర్స్ ఆకృతుల సమర్పణ
శాసనసభ, హైకోర్టు భవంతులపై ముఖ్యమంత్రి చేసిన సూచనలకు అనుగుణంగా కొత్త ఆకృతులు సిద్ధం చేశామని ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తెలియజేశారు. వీటితో పాటు అమరావతిలో పరిపాలన నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్పై 400 పేజీల నివేదికను ఈనెల 24, 25 తేదీలలో ప్రభుత్వానికి సమర్పిస్తామని వారు చెప్పారు. బుధవారం రాత్రి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ బృందంతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గత సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన మార్పుల ప్రకారం శాసనసభ భవంతిని కోహినూర్ వజ్రాకారంలో, హైకోర్టు భవంతిని బౌద్ధ స్థూపాకారంలో మార్చి ఈ నవీన ఆకృతులకు రూపకల్పన చేసినట్టు ఫోస్టర్స్ బృందం ప్రతినిధి క్రిష్ ముఖ్యమంత్రికి వివరించారు.
హైకోర్టు భవంతికి సంబంధించిన నిర్మాణ, విస్తరణ వ్యూహాలు, వినియోగించాల్సిన భవన నిర్మాణ సామాగ్రి గురించి ఫోస్టర్స్ ప్రతినిధులు తమ ప్రెజెంటేషన్లో వివరాలు అందించారు. రాజధానిలో కొత్తగా నిర్మించిన పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవంతుల గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇవి తనకు బాగా నచ్చాయని చెప్పారు. చుట్టూ పచ్చదనంతో ఆహ్ల్లాదకర వాతావరణంలో ఐకానిక్ కట్టడాలుగా వీటిని తీర్చిదిద్దారని ప్రశంసించారు. రాజధానిలో నిర్మించే ప్రతి భవంతిని ఇలా విలక్షణంగా తీర్చిదిద్దాలని అన్నారు. తాము సూచించిన ఆకృతులకు తగినట్టు నిర్మాణాలు చేపట్టడంలో ఏవైనా పరిమితులు, ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని, ముందస్తుగా మరికొన్ని ప్రత్యామ్నాయ ఆకృతులను సిద్ధం చేసి పెట్టుకోవాలని ముఖ్యమంత్రి ఫోస్టర్స్ బృందానికి సూచించారు. అంతిమంగా ఇవి ప్రపంచంలోనే అత్యుత్తమ నిర్మాణాలుగా పేరు తెచ్చుకోవాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. సెప్టెంబరు 30న నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నామని, ఆ లోగా తుది ఆకృతులు, సవివర ప్రణాళికలు సిద్ధమయ్యేలా గడువు పెట్టుకున్నామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు.
వారధి కూడలిలో ప్రతిపాదించిన ‘బుద్ధ చక్ర’పై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి ఆధ్వర్యంలో రూపొందించిన కొన్ని ఆకృతులను సమావేశంలో సమర్పించింది. వీటిని ముఖ్యమంత్రి ఆమోదించారు. 27 అడుగుల ఎత్తులో ‘బుద్ధ చక్ర’ను రూపొందించనున్నారు. బేస్మెంట్తో కలుపుకుని కట్టడం మొత్తం 40 అడుగుల మేర ఉంటుంది. ‘బుద్ధ చక్ర’ను మొత్తం శాండ్ స్టోన్తో నిర్మిస్తారు. దీని తయారీకి ప్రత్యేక యంత్రసామాగ్రిని ఉపయోగించనున్నారు. ‘బుద్ధచక్ర’ నిర్మాణాన్ని నాలుగు నెలల కాలంలో పూర్తిచేస్తారు. రూ.9 కోట్లు కేవలం రాతి నిర్మాణానికే ఖర్చు కాగలదని అంచనా. 2018 జనవరి నాటికల్లా మొత్తం కట్టడాన్ని పూర్తి చేస్తామని ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి చెప్పారు.
శాఖమూరు పార్కును ప్రహారీ గోడ లేకుండా నిర్మించాలని ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి సమావేశం ముందుంచింది. రాజధానిలోని ఏ నిర్మాణానికీ ప్రహారీ అవసరం లేకుండానే అందమైన ప్రవేశ ద్వారాలతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. పవిత్ర సంగమం నుంచి పరిపాలన నగరానికి వెళ్ళేందుకు కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జిపై ఈ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 5 ఐకానిక్ వారధులు రానున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ వారధులు రానున్న కాలంలో రాజధాని సోయగాన్ని ద్విగుణీకృతం చేయనున్నాయని అన్నారు. సమావేశంలో పురపాలక మంత్రి పి. నారాయణ, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్ జైన్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి పాల్గొన్నారు.













