హుజూరాబాద్ బరిలో 30 ..బద్వేల్ బరిలో 15 మంది
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 12 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సైతం తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రస్తుతం 30 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్ ఉప ఎన్నిక పోటీలో నిలిచారు. బద్వేల్లో ఈ నెల 30న పోలింగ్, నవంబర్ 2న లెక్కింపు జరగనుంది.













