ఏపీ గవర్నర్ మరో అరుదైన నిర్ణయం
ఆడంబరాలకు దూరంగా ఉండే రాష్ట్ర ప్రథమ పౌరుడు మరో అరుదైన నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పర్యటన సందర్భంగా తనకు ఎర్ర తివాచీ స్వాగతం పలికే సంప్రదాయాన్ని పాటించవద్దని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి సృష్టం చేశారు. బ్రిటిష్ వలసపాలనకు చిహ్నమైన ఎర్ర తివాచీ స్వాగతం సంప్రదాయాన్ని విడనాడాలని చెప్పారు. గవర్నర్ ఇటీవల శ్రీశైలం వెళ్లినప్పుడు సంప్రదాయం ప్రకారం జిల్లా అధికారులు ఆయనకు ఎర్ర తివాచీ స్వాగతం పలికారు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన కొన్ని అధికారిక కార్యక్రమాల్లో మినహా తన పర్యటనల్లో ఎక్కడా ఎర్రతివాచీ స్వాగత సంప్రదాయాన్ని పాటించవద్దని సూచించారు.













