ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… టెట్, మెగా డీఎస్సీలకు
ఆంధ్రప్రదేశ్లో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సమయమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇవ్వాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టెట్, డీఎస్సీ పరీక్షల తేదీలను నిర్ణయించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తిచేసేలా కార్యచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికీ డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు.
టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు లోకేశ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రిపరేషన్కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తిలను పరిశీలించిన మంత్రి లోకేశ్, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. టెట్కు 90 రోజులు, అలాగే, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్లోగా ప్రక్రియ పూర్తి చేసి జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.













