Nara Lokesh: నిరుద్యోగులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్

మెగా డీఎస్సీని (mega DSC) ఇటీవలే పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరోసారి ఉపాధ్యాయ నిరుద్యోగులకు (Teachers Recruitment) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఏటా డీఎస్సీ (DSC) నిర్వహిస్తామన్న హామీకి అనుగుణంగా వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రకటించారు. విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యారంగంపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉపాధ్యాయ నియామకాలతోపాటు, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వంటి అంశాలపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు.
ఎన్నికల హామీకి అనుగుణంగా ప్రభుత్వం ప్రతి ఏటా డీఎస్సీ (DSC) నిర్వహిస్తామని స్పష్టం చేసింది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఇది శుభవార్త. అందులో భాగంగా వచ్చే నెల చివరివారంలోనే టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీతో పాటు స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ కూడా జారీ చేయనుంది. మార్చిలో పరీక్షలు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి ఉపాధ్యాయులు విధుల్లో చేరేలాగా నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఇప్పటి నుంచే నిరుద్యోగ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావాలని నారా లోకేశ్ సూచించారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పలు చర్యలు చేపట్టనున్నారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు బేస్లైన్ టెస్టుల నిర్వహణకు విధివిధానాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తి చేసి, ఆ తర్వాత 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. విద్యా వ్యవస్థలో వినూత్న పద్ధతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్రంలోని 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపాలని నిర్ణయించారు.
విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలో రూ.100 కోట్ల భారీ వ్యయంతో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఉత్తమమైన డిజైన్ను ఎంపిక చేసేందుకు హ్యాకథాన్ నిర్వహించాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లోని గ్రంథాలయాలను ఆధునికీకరించి, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన లైబ్రరీ సెస్సును వసూలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 11 జవహర్ నవోదయ విద్యాలయాల పనులను వేగవంతం చేయాలని కోరారు. హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం (మిడ్-డే మీల్స్) నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. కడపలో విజయవంతమైన స్మార్ట్ కిచెన్ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. తమ దృష్టికి వచ్చిన 423 వినతుల్లో ఇప్పటికే 200 వినతులను పరిష్కరించామని అధికారులు వివరించారు. మిగిలిన వినతులు విధానపరమైన, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నట్టు తెలిపారు. మొత్తానికి విద్య వ్యవస్థను నారా లోకేశ్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను ప్రతి ఏటా నిర్వహించడంతో పాటు మౌలిక వసతులు, విద్యార్థుల్లో నాణ్యత పెంపు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.