ఆయన గత చరిత్ర ఏమిటో అందరికి తెలుసు : నాదెండ్ల మనోహర్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేపథ్యం గత చరిత్ర ఏమిటో అందరికి తెలుసని, సీఎం పదవి ఆయనకి ముసుగులా ఉందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చేసిన ఘనకార్యాలూ ప్రజలకు తెలసుని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన నిత్యం పోరాడుతున్న వారికి సాయం చేస్తున్న జనసేన పార్టీకీ సీఎం కాండక్ట్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. జనసేన పార్టీపై నోటికి వచ్చినట్టు సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సొంత నియోజకవర్గం పులివెందులలోనూ పరదాలు కట్టుకోకుండా పర్యటించలేని ఈ సీఎం కూడా మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందుల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడి వారి కోసం పోరాటం చేశాం. డొక్కా సీతమ్మ ఆహార కేంద్రాల పేరుతో భోజనం అందించాం. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. అలాంటి మా పార్టీ పట్ల ముఖ్యమంత్రి దిగజారుడు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. ప్రజలతో, ప్రజల కోసం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించకుండా, పరదాలు కట్టుకొని, బారికేడ్లు పెట్టుకొని దుకాణాలు మూయించి వేసి మరీ పర్యటనలకు రావడం ఎక్కడా చూడని వింత చర్య. స్కూళ్లు, కాలేజీలు మూయిస్తున్నారు. ప్రజలను దగ్గరకి రానివ్వకుండా పరిపాలించడం ఈ ముఖ్యమంత్రికే చెల్లుబాటు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.













