విద్యార్థులకు ఏమైనా అయితే.. ఎవరు బాధ్యత

10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. నియంతలా వ్యవహరించడం జగన్మోహన్ రెడ్డికి తగదన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గించి చూపించొద్దన్నారు. పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్కడికి చేరుకునేందుకు బస్సు, ఆటోనో పట్టుకొని రావాల్సిందే కదా అని నిలదీశారు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం ఎందుకు చొరవ చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా పడతాయన్న విశ్వాసం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.