Nara Lokesh: ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్

సిడ్నీ (ఆస్ట్రేలియా): అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం. మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలి. ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ రూమ్ లో ఏపీ ఎన్ఆర్ టి ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు కనిపిస్తారు. ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు లేని దేశం ఏదీ లేదు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మనదే డామినేషన్. నేను ఎయిర్ పోర్ట్ దగ్గర నుంచి చూస్తున్నాను. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ ను ఇవ్వడం జరిగింది. మా ప్రధాని గారికి కూడా ఇంతగా స్వాగతం ఉండదని అతను అంటున్నాడు. మీ జోషే వేరు. మీ మాస్ జాతర సూపర్. తెలుగుజాతికి గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు వాడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు మన ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని స్థాపించారో అక్కడి నుంచి జన నాయకుడు, మన నాయకుడు చంద్రబాబునాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబునాయుడు గారు తెలుగువాడి సత్తాను ప్రపంచానికే పరిచయం చేశారు. 1995లో పెద్దఎత్తున సంస్కరణలు తీసుకువచ్చి ఐటీ విద్యను దగ్గర చేశారు.
చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు
కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి జరిగినట్లా, ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల ఏం జరుగుతుందని ఆనాడు ఎగతాళి చేశారు. ఇప్పుడు వారి నోటి నుంచి మాట రావడం లేదు. ఆయన వయస్సు 75 అయినా ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడిలా పరిగెడతారు. ఆయన మంత్రివర్గంలో చాలా మంది యువకులం ఉన్నాం. ఇప్పటికీ ఆయన స్పీడ్ ను మేం అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటం కంప్యూటింగ్ అంటే నాకే అర్థం కాలేదు. నేను చాట్ జీపీటీలో వెతికాను. అందుకే ఆయనను విజనరీ అంటాం. ఇంకొకరిని ప్రిజనరీ అంటాం. అర్థం అయిందా రాజా! అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐ లు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నేను మాత్రం మిమ్మల్ని ఎంఆర్ఐ లు అంటాను. ఎంఆర్ఐ లు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సముద్రాలు దాటినా సొంత ఊరు, సొంత రాష్ట్రం అంటే మీకు ప్రేమ. చంద్రబాబు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు మీరంతా ఎంతో బాధపడ్డారు. ఆస్ట్రేలియా లోని ప్రతి సిటీ లో మీరు నిరసన కార్యక్రమాలు చేశారు. మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ రోజు హైదరాబాద్ లో 45వేల మంది వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అప్పుడే ప్రజలకు సేవ చేయాలని, ప్రజల మెప్పు పొందాలని సంకల్పించాను. సొంత రాష్ట్రాన్ని కాపాడేందుకు 2024 ఎన్నికలను మీ సొంత ఎన్నికల్లా భావించారు. మీరే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో అదే విధంగా ఇక్కడున్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు. కూటమి గెలుపుకోసం అహర్నిశలు కష్టపడ్డారు. దాని ఫలితమే ఈ రోజు 94శాతం సీట్లు గెలిచాం. మేం గెలుస్తామని తెలుసు కానీ.. ఇలాంటి వేవ్ వస్తుందని ఊహించలేదు. దీనివెనుక ఇక్కడున్న ప్రతి వ్యక్తి కష్టం ఉంది.
ఏపీకి గత 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి
మీరు మాకు అద్భుతమైన మాండేట్ ఇచ్చారు. 50 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచారు. అందులో నేనూ ఒకడిని. 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రులు కొత్తవారు. కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం. 1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు గారు చేసి తెలుగువారిని తలెత్తుకుని తిరిగేలా చేశారో.. అదే మ్యాజిక్ చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి. రెండింటినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి. గత 16 నెలలుగా మీరు చూస్తే.. ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క ఏపీకి వచ్చాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. అనంతపూర్ ను ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఉత్తర అనంతపూర్, కర్నూలును రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. లైమ్ స్టోన్ ఉన్న దగ్గర సిమెంట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. చిత్తూరు, కడపను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా మారుస్తాం. నెల్లూరుకు రిఫైనరీని కూడా తీసుకురాబోతున్నాం. ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్ గా, కృష్ణా, గుంటూరు జిల్లాలను క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలను ఢిఫెన్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నాం. కర్నూలుకు డ్రోన్ సిటీని ఇప్పటికే ప్రకటించాం. పనులు కూడా మొదలుపెడుతున్నాం. ఉత్తరాంధ్రను మెడికల్ డివైజ్ మ్యానుఫాక్చరింగ్, ఫార్మా హబ్ తో పాటు స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతోంది మీ ప్రజా ప్రభుత్వం.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు గారు.. ఇద్దరూ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకున్నాం, రైల్వే జోన్ ను ఏర్పాటుచేసుకున్నాం, ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం. ఐదేళ్లలో పోలవరం పనులు కూడా పూర్తిచేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్తాం.
కేంద్ర సహకారం వల్ల గూగుల్ సిటీ రాష్ట్రానికి వచ్చింది
కేంద్ర సహకారంతో కొప్పర్తి నోడ్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మాసిటీ.. ఇలా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం. గూగుల్ ను ఏపీకి రావాలని నేను కోరినప్పుడు కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు చేయాలని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానితో మాట్లాడారు. అప్పుడు ప్రధాని స్వయంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి చట్టాలను సవరించే పరిస్థితి. ఆర్సెల్లర్ మిట్టల్ ప్రాజెక్ట్ విషయంలోనూ ఇదేవిధంగా జరిగింది. ఒక్క జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చింది. మరోవైపు నాకు సోదర సమానుడైన పవనన్న. ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పారు. పొత్తు ఉన్నప్పుడు చిన్న, చిన్న సమస్యలు ఉంటాయి. వచ్చే 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ఏపీని ముందుకు తీసుకెళ్దామని పదేపదే చెబుతున్నారు. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెం.1గా ఉండాలనేదే ఏకైక అజెండా. మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలి. గత ఐదేళ్లు మనం తలదించుకుని బతికిన పరిస్థితి. పీపీఏలను రద్దు చేశారు. అనేక ప్రాజెక్టులను రద్దు చేశారు. దానివల్ల ఏపీతో పాటు దేశం కూడా తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే లక్ష్యంతో పవనన్న, చంద్రబాబు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి
మీరు మీ కంపెనీల్లో బ్రాండ్ అంబాసిడర్స్ కావాలని ఇక్కడున్న వారిని కోరుతున్నా. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా. ఏదైనా కంపెనీ దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు మాకు తెలియజేయండి. ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేం తీసుకుంటాం. గడచిన ఐదేళ్లు మీరు మాతో కలిసి పోరాడారు. మనం మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్ నిర్మాణం చేయాలి. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఏదీ అంత సులభం కాదు. నా జీవిత ప్రయాణం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కష్టపడదాం. ఒక ఫోకస్ తో పనిచేద్దాం. ఎదురుదెబ్బలు తగిలినా నిలబడదాం. మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందాం.
గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యం
నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యం. ఏపీఎన్ఆర్టీలో మీకు మద్దతుగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తాం. దానిని ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకు లింకప్ చేస్తాం. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా. ఒక్కసారి ఏపీలో పెట్టుబడులు పెడితే అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్. ఆస్ట్రేలియా లో సుమారు 75 వేల మంది తెలుగు వాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ లో 25 వేల మంది తెలుగు వాళ్లు ఉన్నారు. 21 వేల మంది తెలుగు విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు. మీకు ఏపీ ఎన్ఆర్ టీ ఎప్పుడూ అండగా నిలబడుతుంది. ఓంక్యాప్ ద్వారా లక్ష మందికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ రోజు మీ ముందు ఉన్నానంటే కారణం ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఐదేళ్ల నుంచి స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు అనేక యూనివర్సిటీలను కలుస్తున్నాం. అందరం కలిసకట్టుగా పనిచేస్తే చరిత్రను తిరగరాయవచ్చని అన్నారు. అనంతరం పలువురు ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిడ్నీలో భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఎస్.జానకీ రామన్, ఏపీ ఎన్ఆర్ టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరి రవికుమార్ తో పాటు వెంకటేష్ ఎనికేపాటి, కిషోర్ బలుసు, విజయ్ చెన్నుపాటి, నవీన్ కుమార్ నెలవల్లి, విశ్వనాథ్ దాసరి తదితరులు పాల్గొన్నారు.