Nara Lokesh: గత ఐదేళ్లలో 12 లక్షల మంది దూరమయ్యారు : మంత్రి లోకేశ్
గత ఐదేళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. రాష్ట్రంలో 100 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలల సంఖ్య 550 కంటే ఎక్కువగా ఉందన్నారు. అసెంబ్లీ (Assembly)లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేతకానితనం కారణంగా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రం 2 నుంచి 14వ స్థానానికి పడిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రాపవుట్లపై దృష్టి సారించిందని తెలిపారు.
గత ప్రభుత్వం 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ (CBSE) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆడంబరంగా చెప్పింది. కానీ, అందుకు తగినట్లు పాఠశాలలు, ఉపాధ్యాయులను మాత్రం సిద్ధం చేయలేదు. సరైన కారాచరణ లేకుండా సీబీఎస్ఈ విధానాన్ని తీసుకురావడంతో అనుత్తీర్ణత శాతం పెరిగింది. అదే తీరుతో అనాలోచిత నిర్ణయంతో ఐటీ సిలబస్ (IT Syllabus) ప్రవేశపెట్టారు. ఐబీ సిలబస్ (IB Syllabus ) పై అధ్యయనం కోసమే రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు అని పేర్కొన్నారు.













