అనుకున్న సమయానికి పూర్తి చేసి.. జాతికి అంకితం చేస్తాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ప్రకారం పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఆర్అండ్ఆర్ కాలనీ పనులను పరిశీలించామని తెలిపారు. పోలవరం పనులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. వరదలు వచ్చే సమయం లోపల స్పీల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, స్పిల్వే, గేట్లు అన్ని పూర్తి చేసి అప్పర్, లోయర్ డ్యామ్లను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నీటిని స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన అనుమతులు తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని పేర్కొన్నారు. గత వరదల్లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను గుర్తించామని తెలిపారు.
కాపర్ డ్యామ్ పనులు పూర్తయిన తర్వాత దానికి మరమ్మతులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు పూర్తవుతాయని, వరదలు వచ్చే సమయానికి 41 కాంటూర్లో ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు పూర్తవుతున్నాయని చెప్పారు. వారికి కావాలసిన పునరావాస కాలనీలు కూడా పూర్తి కావస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిపై పూర్తిగా దృష్టిపెట్టి పనులు చేయిస్తున్నారని గుర్తు చేశారు. డ్యామ్ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, పూర్తి నాణ్యతతో డ్యామ్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.













