రేపు మంగళగిరిలో టెక్ టవర్ తో పాటు, 16 ఐటి కంపెనీలు ప్రారంభం…
నవ్యాంధ్రలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది. ఐటీ కంపెనీలతో పాటు… వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు… ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో ఐటీ సంస్థల సందడి మరింత పెరగనుంది. రేపు, అనగా 17వ తేదీన, 16 చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ప్రారంభంకానున్నాయి… రేపు ఉదయం 9 గంటలకు మంగళగిరి లోని ఫై కేర్ ఐటి పార్క్ మరియు ఎన్ఆర్టి టెక్ పార్క్ లో మంత్రి నారా లోకేష్ 16 ఐటి కంపెనీలను ప్రారంభించనున్నారు… మంగళగిరి సమీపంలోని ఏపీ ఎన్ఆర్టీ టెక్పార్కులో 13 కంపెనీలు, మంగళగిరిలోని పైకేర్ ఐటీ పార్కులో మరో మూడు కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ ఏపీ ఎన్ఆర్టీ సంస్థ చొరవతో వస్తున్న కంపెనీలు. వీటిలో 90 శాతం అమెరికా కంపెనీలు, బ్రిటన్కు చెందినవి ఒకటి రెండు, మన దేశంలో వేరే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఉన్నాయి..
ఈ కంపెనీలు రావడంతో తక్షణం ఆరు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెట్టాక సుమారు 1800 మందికి ఉపాధి లభిస్తుంది. మరో 20 వరకు కంపెనీలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.16 కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి… సిగ్నం డిజిటల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, చారువికెంట్ ఐటీఈఎస్ ప్రైవేటు లిమిటెడ్, అద్వైత్ అల్గారిథం, స్క్రిప్ట్ బీస్, స్వరా సాఫ్ట్, సన్ స్వెట్, పిక్సీ, సువిజ్, డీఎఫ్ఐ స్విస్, ఎక్సెల్లార్, మెక్ మై క్లినిక్, బీవీజీ ఇండియా కంపెనీలు ఉన్నాయి.. ఇందులో మూడు స్టార్ట్ అప్ కంపెనీలు ఉన్నాయి.. ఈ కంపెనీల్లో మెక్ మై క్లినిక్, ఎక్సెల్లార్, బీవీజీ ఇండియా కంపెనీలు పైకేర్ ఐటి పార్కులో ఏర్పాటుఅవుతున్నాయి… మిగతా 13 కంపెనీలు ఎన్ఆర్టీ ఐటీ పార్కులో వస్తున్నాయి..













