Kasireddy: కసిరెడ్డి కేసులో.. పోలీసులపై న్యాయమూర్తి సీరియస్, అసలేం జరిగింది..?

ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని(Raj Kasireddy) పోలీసులు ఏసీబీ (ACB) కోర్ట్ లో ప్రవేశపెట్టగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి తన వాదనలు వినిపించారు. విచారణకు హాజరు అవుతాను అని చెప్పినా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసాడు. తన కార్ సీజ్ చేసారు నా ఇంటితో పాటు నా బంధువుల ఇళ్లలో,స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారని కసిరెడ్డి న్యాయమూర్తికి దృష్టికి తీసుకువెళ్ళారు.
ఇక సోదాల్లో ఏమైనా సీజ్ చేసారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా తన కార్ మాత్రమే సీజ్ చేసారని తెలిపారు. విచారణ పేరుతో తల్లి తండ్రులను ఇబ్బందులు పెట్టారని న్యాయమూర్తికి కసిరెడ్డి వివరించారు. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని తాను సంతకాలు చేయలేదని చెప్పగా.. రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడంపై సిట్ అధికారులపై న్యాయమూర్తి మండిపడ్డారు. రిమాండ్ రిపోర్టులో కనీసం పారాలు లేవు… పేజి నెంబర్లు లేవని.. ఎఫ్ ఐఆర్ పేరు లేదు కదా ఎలా అరెస్ట్ చేశారు అని అసహనం వ్యక్తం చేసారు.
సత్య ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశామని అధికారులు వివరించారు. ఇక రాజ్ కసిరెడ్డి విచారణకు ఏ మాత్రం సహకరించట్లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. పూర్తిస్థాయిలో కస్టడీకి తీసుకుని విచారణ చేయాలని కోర్ట్ కి తెలిపారు. ఇక ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి.. కోర్టు ప్రొసీజర్స్ ని ఫాలోవ్వాలని సుప్రీంకోర్టు ఎన్ని సార్లు చెప్పిన… మేము ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు రావడం లేదని పోలీసుల తీరుపై జడ్జి అసహనం వ్యక్తం చేసారు.
తాము చెప్తే కేసు వివరాలు ఇస్తారని.. ఆ తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి అని అసహనం వ్యక్తం చేసారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై పిసి యాక్ట్ (17ఏ)1988 ప్రకారం నమోదు చేస్తూ మెమో దాఖలు చేసిన తీరుపై న్యాయమూర్తి మండిపడ్డారు. గంట ముందు ఎలా మెమో దాఖలు చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి నిలదీశారు. మెమో మళ్ళీ దాఖలు చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ఆదేశించారు. మెమో దాఖలు చేసిన తర్వాత కేసును మళ్ళీ కేసును విచారిస్తామన్నారు న్యాయమూర్తి.