పవన విద్యుత్ లో ఎపి ఫస్ట్
పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కళా వెంకటరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సంప్రదాయేతర ఇంధన వనరులైన పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన విద్యుత్ సంస్కరణలు ఫలితాలను ఇస్తున్నాయని, రాష్ట్రంలో విద్యుత్ మిగులు ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 149 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందని, పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 75.58 మిలియన్ల యూనిట్లు ఉత్పత్తి అవుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 50 శాతం పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా వస్తోందన్నారు.













