మహాపాదయాత్ర కాదు.. రాజకీయ యాత్ర
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దొంగచాటుగా నిర్వహిస్తున్న యాత్రే అమరావతి రైతుల యాత్ర అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటే అన్ని నియోజకవర్గాల మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మహాపాదయాత్ర రాజకీయ యాత్రగా మారిందని తెలిపారు. సోమిరెడ్డి వల్లే సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులకి చోటు దొరకలేదని ఆరోపించారు. సోమిరెడ్డికి ఉండే పరపతి ఏమిటో రైతులే అర్థం చేసుకోవాలన్నారు. సోమిరెడ్డి టెంట్ వేయిస్తే అందరూ తీసేయండి, తీసేయండి అన్నారని తెలిపారు. యాత్రని అడ్డుకోవాలని తాము భావిస్తే, అస్సలు యాత్రే చేయలేరని, ఎక్కడికక్కడే అడ్డుకుని ఉండేవారమన్నారు. ఆడపడుచులంటే తమకు గౌరవమని తెలిపారు. అందరి అభిమతాలని గౌరవిస్తామన్నారు. మద్దతివ్వలేదని అడ్డంకులు సృష్టిస్తున్నామంటూ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.













