Chandrababu:ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుంది : చంద్రబాబు
ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ (Dubai) , ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియో గ్లోబల్ ఏపీ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి. యూఏఈ (UAE ) అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరం అన్నారు.
యూఏఈతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడి జనాభాలో 40 శాతం మంది భారతీయులే. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలో భారత్కు అపార అవకాశాలు వచ్చాయి. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఉమ్మడి ఏపీలో విజన్ 2020 రూపొందించి రాష్ట్రాభివృద్ధి మెరుగుపరిచాం. రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ (Computing Valley) ఏర్పాటు చేస్తాం. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నాం. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మెరుగైన సాంకేతికతతో అద్భుతాలు సృష్టించే కాలమిది. ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ స్థాపనే మా లక్ష్యం. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారుల వంటి అన్ని పనులు చేస్తున్నాం అని తెలిపారు.







