ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బిహార్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ప్రస్తుత సీఎస్గా ఉన్న నీలం సాహ్ని డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ను ప్రభుత్వం నియమించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. సీఎస్ రేసులో మరో ముగ్గురు అధికారులు ఉన్నప్పటికీ వారంతా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో ఆదిత్యనాథ్ దాస్వైపే సీఎం జగన్ మొగ్గు చూపారు.
దీంతో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లోనూ మార్పు జరిగింది. ఆదిత్యనాథ్ దాస్ సీఎస్గా నియమితులైన నేపథ్యంలో జలవనరులశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖ కార్యదర్శిగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి మారిన ఐఏఎస్ అధికారిని వై.శ్రీలక్ష్మిని పురపాలక శాఖ కార్యదర్శిగా, కె.సునీతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. సీఎస్గా అదిత్యనాథ్ ఈ నెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు.













