పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడొచ్చు కానీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరోసారి హైకోర్టులో ఊరట లభించింది. పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు అనుమతించిన హైకోర్టు డివిజన్ బెంచ్ కొన్ని షరతులు విధిచింది. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, మీడియాతో మాట్లాడకుండా చూడాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఇటీవల డీజీపీని ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలన్న ఆదేశాలను రద్దు చేసింది. మీడియాతో మాట్లాడకుండా చూడాలన్న ఆదేశాలను అమలు చేయాలని సృష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే మీడియాతో మాట్లాడవద్దన్న సింగిల్ జడ్డి ఆదేశాలపై పెద్దిరెడ్డి డివిజన్ బెంచ్కు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు అనుమతిచ్చింది. ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని, ఎస్ఈసీ, కమిషనర్ లక్ష్యంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.













