New Districts: ఆంధ్రప్రదేశ్లో మారనున్న జిల్లాల స్వరూపం..!?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల (AP Districts) సంఖ్యను 32కి పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదిత జిల్లాల పునర్విభజన ప్రక్రియలో (districts reorganization) భాగంగా, పలు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్త జిల్లాల్లోకి మార్చడంతో పాటు, కొన్ని జిల్లాల సరిహద్దులను సవరించే ప్రక్రియ కొనసాగుతోంది. పరిపాలనా సౌలభ్యం, జిల్లా కేంద్రాలకు దూరం తగ్గించడం, సామాజిక-ఆర్థిక అభివృద్ధి, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రజాభిప్రాయాలను సేకరించడానికి ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్-కమిటీని (cabinet sub committee) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ నెల 12 నుంచి సమావేశమై, నెల రోజుల్లో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu) సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా డిసెంబర్ 2025 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
గత వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేసింది. దీని వల్ల కొన్ని చోట్ల సమస్యలు తలెత్తాయి. అందుకే వాటిని సవరించాలని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లాలను రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే, జిల్లాల సరిహద్దులతో పాటు, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలోకి మార్చే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఉదాహరణకు, కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను బాపట్ల, నెల్లూరు నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలోకి మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి.
ప్రతిపాదిత జిల్లాలు మరియు వాటి అసెంబ్లీ నియోజకవర్గాలు:
1. పలాస: ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం
2. శ్రీకాకుళం: శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం
3. మన్యం పార్వతీపురం: పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ
4. విజయనగరం: విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి
5. విశాఖపట్నం: భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి
6. అల్లూరి సీతారామరాజు అరకు: అరకు, పాడేరు, మాడుగుల
7. అనకాపల్లి: అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని
8. కాకినాడ: కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం
9. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం: రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం
10. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అమలాపురం: అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట
11. పశ్చిమ గోదావరి నరసాపురం: తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం
12. ఏలూరు: ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం
13. కృష్ణా మచిలీపట్నం: కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు
14. ఎన్టీఆర్ విజయవాడ: విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం
15. అమరావతి: పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ
16. గుంటూరు: గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు
17. బాపట్ల: బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు
18. పల్నాడు నరసరావుపేట: నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ
19. మార్కాపురం: మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి
20. ఒంగోలు: ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు
21. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఉదయగిరి
22. గూడూరు: గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట
23. శ్రీ బాలాజీ తిరుపతి: తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి
24. చిత్తూరు: చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం
25. మదనపల్లి: మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి
26. సత్యసాయి హిందూపురం: హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర
27. అనంతపురం: అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి
28. ఆదోని: ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం
29. కర్నూలు: కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు
30. నంద్యాల: నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం
31. వైఎస్సార్ కడప: కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల
32. అన్నమయ్య రాజంపేట: రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు
ప్రజాభిప్రాయాలు – డిమాండ్లు:
– ప్రకాశం జిల్లా: అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చాలని బలమైన డిమాండ్ ఉంది. అలాగే, మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
–అమరావతి: అమరావతిని అధికారిక జిల్లాగా ప్రకటించడం వల్ల రాజధాని ప్రాంత అభివృద్ధికి వేగం అందుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
– అన్నమయ్య జిల్లా: రాయచోటి బదులు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కొందరు కోరుతుండగా, మరికొందరు రాయచోటినే కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారు.
– ఏలూరు కృష్ణా: నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోకి చేర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
– అల్లూరి సీతారామరాజు: వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో ప్రతిపాదన వచ్చినప్పటికీ, అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాన్ని పునరాలోచనలోకి తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో 32 కొత్త జిల్లాల ఏర్పాటుపైప్రజాభిప్రాయాలను సేకరించి, చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది.







