భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకూడదు
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నేరాలు జరిగేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ఫోరెన్సిక్ భవనానికి గుంటూరు జిల్లా తుళ్లూరులో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దొంగతనం ఏ రూపంలో అయినా అది పోలీసు, ప్రభుత్వం ఉదాసీనత వల్లనే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేసిన న్యాయస్థానాల్లో ఏదో రకంగా తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారన్నారు. నేరాల ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్థంగా పనిచేసి తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నేరాలకు చెక్ పెట్టేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచంలోనే బెస్ట్ ల్యాబ్గా తయారుకావాలని ఆకాంక్షించారు. అవసరమైన ఫోరెన్సిక్ ల్యాబ్ను గవర్నమెంట్లో పెట్టుకుందామని, ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్కు అవకాశం కల్పిస్తామని అన్నారు. మూడేళ్ల తర్వాత ఈ ల్యాబ్ ప్రపంచంలోనే మంచి ల్యాబ్గా పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. పోలీస్ అధికారులకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలని సూచించారు. పోలీసులు అకౌంట్బులిటీతో వ్యవహరించాలని అన్నారు.













