వైసీపీలో చేరిన శిద్దా రాఘవరావు
ప్రకాశం జిల్లాలో తెలగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శిద్ధా రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాను. సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు అనేకమంది లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.













