ఎన్నికల కోడ్ కాకుండా.. వైసీపీ కోడ్ అమలు చేస్తే : దేవినేని
ఎన్నికల కోడ్ కాకుండా వైసీపీ కోడ్ అమలు చేస్తే, తప్పులు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ఒక ఐజీ, ముగ్గురు కలెక్టర్లను ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించారని గుర్తు చేశారు. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలో ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తోందని, నెక్ట్స్ స్పేస్ భవనంలో ఫేక్ వార్తల్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. సిట్, సీఐడీ కార్యాలయాల్లోని హెరిటేజ్, చంద్రబాబు కేసు, ఇన్నర్రింగ్రోడ్డు కేసు పత్రాలు తగులబెట్టించారు. పత్రాలు తగులబెట్టించిన అధికార ఇప్పుడు అసోంకు బదిలీ అయ్యారు. వైసీపీ బస్సు యాత్ర, తుస్సు యాత్ర అయ్యింది. ఆ యాత్రకు ప్రజలెవరూ రావట్లేదు. నిన్న మేమంతా సిద్ధం సభకు వెళ్లలేదని తండా వాసిని చితకబాదారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారు. తప్పుడు ప్రచారాలతో విషయం చిమ్మేందుకు సజ్జల ప్రయత్నిస్తుంటే, అభివృద్ధి, సంక్షేమమే ధ్వేయంగా కూటమి ముందుకెళ్తోంది అని తెలిపారు.













