ఎటు చూసినా చావు కేకలు! హిందూపురం ప్రజలను చూస్తూనే నా గుండే తరుక్కుపోతుంది!
కరొనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి! నందమూరి బాలకృష్ణ డిమాండ్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వీర విజృంభణ చేస్తోంది. నిత్యం వేలాది మంది కరోనా కాటుకు బలవుతున్నారు. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దహన సంస్కారాలు చేయడానికి ఆస్కారం లేదుకదా కనీసం శవాన్ని దహనం చేద్దామన్న శ్మశానాలు కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నా కరోనాకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. మొదటి దశతో పోల్చితే రెండో దశ కరోనా తాకిడి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై హిందూపురం ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ నాయకులు నందమూరి బాలకృష్ణ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ”కరోనా ఎంతోమంది ప్రాణాలను బలితీసుకొని వారి బ్రతుకులను ఛిద్రం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవ్వరూ బయటకు రాకుండా, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలి. హిందూపురం కోవిడ్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచాలని, కావాల్సినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రి, కలెక్టర్ డీఎం అండ్ హెచ్ఓతో మాట్లాడటం జరిగింది. ఈ రోజు ఆక్సీజన్ అందక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ముందు జాగ్రత్త లేకపోవడం, సరైన మానిటరింగ్ చేయకపోవడం, అధికారుల మధ్య సమన్వయ లోపించడం వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా ఆసుపత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. అందుకే ఈ రోజు రాష్ట్రంలో ఎటు చూసినా చావు కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో అభద్రతాభావం పెరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి సరైన వైద్య సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేస్తున్నా. స్టే హోమ్.. స్టే సేఫ్” అంటూ బాలకృష్ణ ఎమోషనల్ గా స్పందించారు.













