దమ్ముంటే పాదయాత్రను అడ్డుకో.. బొత్సకు రామకృష్ణ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. అమరావతి రైతుల పాదయాత్ర ఆపేందుకు 5 నిమిషాల సమయం చాలన్న బొత్స వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బొత్సకు దమ్ముంటే అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. హైకోర్టు ఉత్వర్వులు మేరకు అమరావతి పాదయాత్ర జరుగుతుందన్న విషయాన్ని వైసీపీ నాయకులంతా గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పాదయాత్రకు బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదేనన్నారు. జగన్ పాదయాత్రకు అప్పట్లో ఎవరైనా అడ్డొచ్చారా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డా కూలీలతో మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నా చేయించారని ఆరోపించారు.













