దీక్ష విరమించిన సీఎం రమేశ్
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్ చేపట్టిన దీక్షను విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మరసం ఇచ్చిన సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల దీక్షలను విరమింప చేశారు. అంతకుముందు వారి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రాణం పోయినా ఫర్వాలేదని దీక్ష చేస్తున్న రమేశ్కు అభినందనలు. ఆరోగ్యం బాగాలేకున్నా ఏడు రోజులు బీటెక్ రవి దీక్ష చేశారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పవిత్రమైన భావం, చిత్తశుద్ధితో రమేశ్ దీక్ష చేస్తున్నారు. దీక్షలపై ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు మానుకోవాలి. విభజన చట్టం ప్రకారం ఆరు నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉంది. రెండు నెలల్లోపు ఉక్కు పరిశ్రమపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే సగం ఖర్చు భరిస్తాం. కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఓ కమిటీ వేస్తాం. కేంద్రంతో మాట్లాడతాం. పార్లమెంట్లో పోరాడతాం అని చంద్రబాబు అన్నారు.













