మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రెండు రోజుల్లో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయుల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్. షన్మోహన్ పాల్గొన్నారు.













