యోగాంధ్ర 2026 పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, మే 30: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. యోగాంధ్ర -2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిలో 25 వేల మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ వంతెనపై యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా నదిపై నిర్మించిన బ్రిడ్జిపై కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న నిర్వహిస్తారు. అలాగే అదే రోజు జిల్లా కేంద్రాల్లో 1000 మందితో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో నిర్వహించాలని సీఎం సూచించారు. మొత్తంగా కలిపి కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్దం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది ట్రైనర్లకు అందనంగా మరో లక్ష మందిని ట్రైనర్లుగా చేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ఒక జిల్లా ఒక థీమ్ తో 14 రోజుల యోగాంధ్ర నిర్వహిస్తారు. జిల్లాల్లో యోగాంధ్ర నిర్వహణకు జిల్లాకు రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.
*అన్ని శాఖల సమన్వయం… కోటి మంది భాగస్వామ్యం*
ఆరోగ్య, మానవవనరులు, మునిసిపల్, పంచాయతీ రాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలోని రెండు ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లో అంటే 56 టూరిస్టు కేంద్రాల్లో ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తారు. ఒక రోజు రెండు జిల్లాల చొప్పున 500 మందితో టూరిస్టు ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తారు. అలాగే 14 రోజుల పాటు పార్కులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తారు. యోగాంధ్ర ఈవెంట్స్ కు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవార్డులు చేస్తారు.
*యోగాపై మంతెన సత్యనారాయణ రాజు ప్రత్యేక వీడియోలు*
రాష్ట్ర ప్రభుత్వ యోగా, నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు యోగాంధ్ర నిర్వహణకు సంబంధించి రూపొందించిన పోస్టర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. యోగాపై అవగాహనకు, శిక్షణకు తాను చేపట్టిన కార్యక్రమాలను సత్సనారాయణ రాజు సీఎంకు వివరించారు. 90 ఆసనాల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాలు వీడియోలు, రోజు వారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామంపై 7 వీడియోలు, యోగా సందేహాలు ప్రశ్నలు-సమాధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్ డొమైనులో పెట్టనున్నట్లు తెలిపారు. మీడియా, సోషల్ మీడియా, వివిధ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. 8142404888 నెంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సత్యనారాయణ రాజు వివరించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ తో పాటు సీఎస్ సాయి ప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీర పాండియన్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







