గెలుపు విషయంలో నేను భయపడటం ఏంటి : చంద్రబాబు
గెలుపు విషయంలో తాను భయపడటం ఏంటి ఆని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 50 శాతం వివి ప్యాట్స్ లెక్కించడానికి ఇసీ కున్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విజిల్ బ్లోయర్ గా పని చేస్తున్న వ్యక్తిపైనే కేసులు పెడుతున్నారన్నారు. పారదర్శకంగా ఉండే విషయంలో ఇసి కున్న సమస్య ఏంటని అడిగారు. ఎన్నికల సంఘం సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎవరైనా పోలింగ్ ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు. ఏవో సమాధానాలు చెప్పి ఇసీ తప్పించుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. ఈ స్థాయిలో అవకతవకలతో పోలింగ్ ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. చాలా దేశాలు ఇవిఎం లను ఉపసంహరించుకున్నాయని తెలిపారు. ఇవిఎం మెమరీ చిప్ప్ ను తారుమారు చేయొచ్చని అన్నారు.
ఏపీలో పోలింగ్ అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా జరిగిందా అని అడిగారు. ఇవిఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని కోరారు. సందేహాలకు సమాధానం చెప్పండి అంటే ఎదురు దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. గెలుపు విషయంలో తాను భయపడటం ఏంటి అని మరో సారి ప్రశ్నించారు. సుప్రీంలో తప్పుడు అఫిడవిట్ వేయడానికి కూడా కేంద్రం వెనుకాడలేదని చెప్పారు. ఇవిఎంలు పని చేయకపోవడానికి బాధ్యులెవరని, ఇవిఎం ప్రోగ్రామింగ్ ఎర్రర్స్కు బాధ్యులెవరని అడిగారు. తెలంగాణలో ఎన్నికల ముందు 25 లక్షల ఓట్లు తొలగించారన్నారు. 25 లక్షల ఓట్లు తొలగించి ఇసీ సారీ చెప్పిందని ఎద్దేవా చేశారు.













