Venkaiah Naidu: ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పదవికి రాజీనామా చేయాలి : వెంకయ్య నాయుడు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడి యత్నాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడికి ప్రయత్నం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఛీఫ్ జస్టిస్ (Chief Justice) కి సంబంధించిన అంశం కాదు, సమాజానికి, వ్యవస్థకి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు పార్టీ మారితే, ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా (Resignation) చేయాలని తెలిపారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ మారి మంత్రులు (Ministers) అవుతున్నారని ఆరోపించారు. చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహారించకూడదని సూచించారు. ప్రజలకి అందించే ఉచితాలు పరిధులు దాటుతున్నాయని వివరించారు. ప్రభుత్వాలు తాహతుకు మించి అప్పులు చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు అప్పులు తెచ్చేటప్పుడు, ఎలా తీరుస్తారో ప్రణాళికలు అసెంబ్లీలో చర్చించాలని ఆయన కోరారు.
చట్టసభల్లో కుటుంబ సభ్యులని దూషించడం సరికాదని హితవు పలికారు. అలాంటి వారిపై చట్టాన్ని ప్రయోగించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశంలోనే ఉందని గుర్తుచేశారు. మనదేశ కీర్తిని ప్రతి ఒక్కరూ చాటాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసులుపై రెండేళ్లలోపే విచారణ జరగాలని చెప్పారు. ప్రభుత్వాలు కోర్టుల సంఖ్యలు పెంచి, జడ్జీలని నియమించాలని కోరారు. రాజకీయ వారసత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.