ఏపీలో 4.39 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. ఈ సదస్సులో సుమారు రూ. 3 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరుగుతాయని అంచనా వేయనగా, 46 శాతం అధికంగా రూ.4,39,765 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్త భాగస్వామ్యంతో విశాఖలోని హార్బర్పార్కులోని ఏపీఐఐసీ గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ముగిసింది. మూడు రోజుల సదస్సులో 60 దేశాల నుంచి 280 మంది ప్రతినిధులు, 3,673 మంది భారతీయ పారిశ్రామికవేత్తలు, 500 మంది బిజినెస్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 4,453 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 55 ద్వైపాక్షిక్ష సమావేశాలు జరిగాయి. పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఏపీఈడీబీ, పరిశ్రమలు, ఐటీ వంటి శాఖలు క్రియాశీలకంగా వ్యవహరించాయి. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధిసంస్థ లక్ష మంది నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణనిచ్చేందుకు పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి.













